Farmers | చండీగఢ్, మార్చి 6: హర్యానాలో ఆవాలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే తమ పంటను ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆవాలుకు క్వింటాల్కు రూ.5,450 కనీస మద్దతు ధర ఉండగా.. దళారులు రైతుల వద్ద నుంచి కేవలం రూ.4,600-రూ.5,000 మధ్యే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుకు సరైన గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నారు. అప్పులు చేసి పంట సాగుచేసిన తాము తప్పనిసరి పరిస్థితుల్లో పంటను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆవాలు పంట కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
హర్యానాలో దాదాపు 6.50 లక్షల హెకార్లలో అవాలు పంట వేస్తారు. ప్రధానంగా హిస్సార్, కర్నాల్, భివానీ, రేవారీ, మహేంద్రగఢ్, రోహ్తక్ జిల్లాల రైతులు పండిస్తారు. ఈ ఏడాది 13.65 లక్షల టన్నుల పంట ఉత్పత్తి ఉంటుందని అధికారికంగా అంచనా వేశారు. అయితే తీవ్రమైన చలి, పొగమంచు వంటి వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా పంట దిగుమతి పడిపోయింది. మహేంద్రగఢ్ జిల్లాలో 90 శాతం పంట దెబ్బతిన్నదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు జనవరిలో ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. జిల్లాలో 95 వేల హెక్టార్లలో ఈ సీజన్లో రైతులు ఆవాలు పంట వేశారని, అందులో 87 వేల హెక్టార్లలో పంట పలు స్థాయిల్లో దెబ్బతిన్నదని వ్యవసాయ అధికారి బల్వంత్ శహరన్ పేర్కొన్నారు. బల్సామంద్ ప్రాంతం కిర్తాన్ గ్రామానికి చెందిన హోషియార్ సింగ్ అనే రైతుకు ఈ ఏడాది మూడు ఎకరాల్లో పంట వేయగా, ఒక్క క్వింటాల్ మాత్రమే దిగుబడి వచ్చింది. అంతకుముందు ఎకరాకు 7-9 క్వింటాల్ వచ్చేదని అ రైతు కన్నీళ్లు పెట్టుకొన్నాడు.
నాసిక్: కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల తీరుపై మహారాష్ట్రకు చెందిన ఓ రైతు కన్నెర్ర చేశాడు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైన ప్రభుత్వ తీరుకు నిరసనగా నాసిక్ జిల్లా మథుల్తాన్ గ్రామానికి చెందిన కృష్ణ డొంగ్రే అనే రైతు తన ఒకటిన్నర ఎకరాలో పండించిన పంటను తగులబెట్టాడు. అంతకుముందు పంటను తగులబెట్టే కార్యక్రమానికి రావాలంటూ తన రక్తంతో రాష్ట్ర సీఎం షిండేకు ఆహ్వాన లేఖ రాశారు. రూ.1.5 లక్షలు ఖర్చు చేశానని, ఉల్లిని మార్కెట్ను తరలించాలంటే మరో రూ.30 వేలు వ్యయం అవుతుందని, ఇంతచేస్తే ప్రస్తుత ధర ప్రకారం రూ.25 వేలు మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.