చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ కట్టర్ ఇటు విద్యార్థులకు, అటు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ వంతుగా మొక్కలు నాటిన విద్యార్థులకు పరీక్షల్లో అదనపు మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, 8 నుంచి 12 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన చేశారు.
హర్యానా రాష్ట్రం పంచకుల జిల్లాలోని నేచర్ క్యాంప్ తప్లి అండ్ నేచర్ ట్రయల్స్ ఆఫ్ మోర్నిహిల్స్ ప్రాంతంలో పంచకర్మ వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మనోహర్లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా ప్రకటన చేశారు. పర్యావరణ పరిరక్షణలో చెట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని, ఈ క్రమంలో విద్యార్థులను ప్రకృతితో కలిపేందుకు ఈ నిర్ణయం తీసుకొస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర పరిధిలోని అన్ని పాఠశాలలకు ఈ నియమం వర్తిస్తుందని చెప్పారు. 8 నుంచి 12వ తరగతి విద్యార్థులు తమ పాఠశాల పరిధిలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. మొక్కలు నాటి సంరక్షించిన విద్యార్థులందరికీ ఆఖరి పరీక్షల్లో అదనపు మార్కులు కేటాయిస్తామని చెప్పారు. త్వరలోనే అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.