MP Dharambir Singh | న్యూఢిల్లీ: హర్యానా బీజేపీ ఎంపీ ధరమ్బీర్ సింగ్ సహజీవనాన్ని ప్రమాదకర రోగంగా అభివర్ణించారు. దాన్ని సమాజం నుంచి నిర్మూలించేందుకు ప్రభుత్వం చట్టం చేయాలని కోరారు. గురువారం లోక్సభ జీఆరో అవర్లో ఆయన మాట్లాడుతూ ప్రేమ పెండ్లిళ్లలో విడాకుల రేటు పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వివాహాలకు వధూవరులిద్దరి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని కోరారు. ‘ఈ విషయం తీవ్రమైనదని నేను పార్లమెంట్, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఏడు తరాల పాటు కొనసాగే పెండ్లిని పవిత్రమైన బంధంగా పరిగణిస్తారు.
అమెరికాలో 40 శాతంగా ఉన్న విడాకుల రేటులో పోలిస్తే ఇండియాలో దాని రేటు 1.1 శాతం. పెద్దలు కుదిర్చిన పెండ్లిళ్లలో విడాకుల రేటు చాలా తక్కువ. కానీ ఇటీవల విడాకుల రేటులో చాలా పెరుగుదల కనిపిస్తున్నది. దానికి ప్రధాన కారణం ప్రేమ వివాహాలు’ అని ధరమ్బీర్ సింగ్ అన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఒకే గోత్రానికి చెందిన వారి మధ్య వివాహాలు జరగవని.. కానీ ప్రేమ వివాహాల వల్ల పల్లెల్లో చాలా సంఘర్షణలు జరుగుతున్నాయన్నారు. సహ జీవనం మన మన సంస్కృతిని నాశనం చేస్తున్నదన్నారు.