న్యూఢిల్లీ : మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తోసిపుచ్చారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాహుల్పై కఠిన చర్యలు చేపట్టాలని హర్దీప్ సింగ్ సోమవారం ఈసీకి విజ్ఞప్తి చేశారు. రాహుల్కు కేవలం నోటీసులు జారీ చేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన విపక్ష ఇండియా కూటమి ర్యాలీలో రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరకర అంశాలను ప్రస్తావించారని అన్నారు.
బీజేపీకి ఈ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఈసీలో ప్రభుత్వం సొంత మనుషులున్నారని, మోదీ ఈవీఎంలు లేకుండా గెలవలేరని పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. తాము ఈ విషయాలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకువచ్చామని, ఈ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చిందని, వీటన్నింటికి సరైన ఆధారాలు లేవని పేర్కొందని చెప్పారు.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర పాలకులు లాగేసుకున్నారని రాహుల్ ఆరోపించారని, కాషాయ పార్టీకి 400 సీట్లు దక్కితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఓ బీజేపీ కార్యకర్త చెప్పారని రాహుల్ అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. అలా అని ఏ కార్యకర్త చెప్పాడో తమకు తెలియదని అన్నారు. ఇండియా విపక్ష కూటమి చీలిపోతోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి కేవలం నోటీసు జారీ చేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు చేపట్టాలని హద్దీప్ పూరి డిమాండ్ చేశారు.
Read More :
Temperature | రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. రాబోయే 5 రోజులు మరింత పెరుగనున్న ఉష్ణోగ్రతలు