ముంబై: మహరాష్ట్రలోని ముంబైలో సంచలనం రేపిన ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలున్న వాహనం కేసులో మరో ట్విస్ట్ ఆదివారం బయటపడింది. ఆ కారుకు చెందిన మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పదంగా మరణించగా ఆయన మృతదేహాన్ని బాంద్రా నది నుంచి వెలికితీసిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసులపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది.
ఈ నేపథ్యంలో మున్సుఖ్ హిరేన్ మరణానికి కారణమని అనుమానిస్తున్న సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజేను, ఎన్ఐఏ అధికారులు ఆదివారం బాంద్రా నది వద్దకు తీసుకెళ్లారు. ఆయన సూచనలతో మున్సుఖ్ హిరేన్ మృతదేహం లభించిన చోట నది లోపల గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. నదిలో పడి ఉన్న కంప్యూటర్ సీపీయూ, హార్డ్ డిస్క్, ల్యాప్టాప్, కొన్ని వస్తువులతోపాటు ఒకే నంబర్ ఉన్న రెండు ప్లేట్లను గజ ఈతగాళ్లు వెలికితీశారు.
కీలకమైన ఆధారాలు లభించడంతో ఈ కేసులోని అసలు మిస్టరీ వీడవచ్చని తెలుస్తున్నది. కాగా, ఈ రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన్ వాజే కస్టడీని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇటీవల ఏప్రిల్ 3 వరకు పొడిగించింది.