ఎదురుగా కుదురుగా కూర్చొని ధ్రువ కుమారుని కథను వింటున్న విమలమతి విదురునితో మిత్రాసుతుడు మైత్రేయ మహర్షి ఇలా ముచ్చటించాడు- ‘దేవర్షి నారదునిచే మహామంత్ర ఉపదేశం పొంది, ఆయనకు ప్రణమిల్లి ప్రదక్షిణం చేసి ధ్రువుడు పురుషోత్తముడైన పుండరీకాక్షుని పవిత్ర పాద పద్మాల స్పర్శచే పులకించిన మధువనాన్ని తిలకించడానికి ప్రయాణమయ్యాడు’.
నయ విశారదుడు నారదుడు బాలభక్తునికి బోధించిన ‘దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము, జలజంబులను జారు జలజ నయనుఁ’ అనే హృద్యమై, సరస సంవేద్యమైన సీస పద్యానికి మూలంలోని రెండు అనుష్టుప్ శ్లోకాలు ఆధారం. వీనిలో దిఙ్మాత్రంగా నిర్దేశించిన నవ విధ భక్తులలో నిర్గుణ నిష్కామ భాగవత భక్తికి నిచ్చెన వంటి ‘అర్చన భక్తి’ని, ఆత్మీయతను రంగరించి అతి రమణీయంగా రంగులద్ది వివిధ భంగుల విశదీకరించి భావుక హృదయాలలో భక్తి రసాన్ని పొంగులు వారించిన రససిద్ధుడు ప్రజాకవి పోతన ప్రాతఃస్మరణీయుడు.
ధ్రువకుమారుని దూరం చేసుకున్న ధరణీపతి-రాజు ఉత్తానపాదుని చిత్తానికి చిన్నకొడుకు ఉత్తముడు దగ్గరే ఉన్నా మనశ్శాంతి రిక్తమై-శూన్యమైపోయింది. ‘యో ధ్రువాణి పరిత్యజ్య అధ్రువాణి నిషేవతే, ధ్రువాణి తస్య నశ్యంతి అధ్రువం నష్టమేవ హి’- ‘స్థిరమైన వస్తువును వదిలి అస్థిరమైన విషయాలను సేవించేవారికి, అస్థిరమైనవి ఎలాగైనా, ఎప్పటికైనా అంతరించిపోయేవే. కాగా, సుస్థిరమైన సుఖశాంతులకు కూడా నోచుకోక వ్యర్థ జీవనులవుతారు’. అంతేవాసి- శిష్యుడు, ధ్రువుని ఆశీస్సులతో అనుగ్రహించి భక్తి శాస్త్ర ఆచార్యుడు నారదుడు పుత్ర వియోగంతో పరితపిస్తున్న ఉర్వీపతి-ఉత్తానపాదుని సమీపించి అతనిని ఊరడించాడు. ‘నరనాథా! నీ హృదయ నందనుడు- ప్రియ పుత్రుడు, భక్త హృదయ చందనుడైన నందనందనుడు శ్రీహరి ప్రేమ బంధనంలో సురక్షితంగా ఉన్నాడు. వాని కొరకై నీకు వగవ వలసిన అగత్యం లేదు’.
భగవంతుని అండ కలిగిన వారు.. అరణ్యంలో ఉన్నా ఆనందంగా ఉంటారు. ఆయన అనుగ్రహం లేకపోతే రాజగృహంలో రక్షకభటుల రక్షణలో ఉన్న రాజైనా మరణిస్తాడు. మహర్షి పలికిన మాటలను మహారాజు తన మనసులో విశ్వసించి ప్రియపుత్రుని తలచుకొంటూ పూజ్యమైన రాజ్యభోగాల మీద కూడా భోజ్య (అనుభవించాలన్న) బుద్ధి త్యాజ్యమని (విడువదగినదని) తీర్మానించాడు.
‘ఇక ధ్రువుడు మధువనం చేరుకున్నాడు. ఆ మధువనం దేవతలు, మహర్షులు, మునులు, మహాయోగుల ప్రశంసలకు పాత్రమైన పావన వనం. ప్రబలమైన సంసారమనే పయోదాలను (మబ్బులను) పారద్రోలే ప్రభంజనం-పెనుగాలి. నిఖిల పుణ్యాలకు నిలయమైన నిత్యనూతన భవనం’. ధ్రువుడు పావన యమునా జలాలలో స్నానమాచరించాడు. జలస్నానంతో కేవలం శరీర శుద్ధి మాత్రమే. కానీ, సత్యం వలన శాశ్వత మనశ్శుద్ధి సమకూరుతుంది. సత్యనారాయణుని నిత్య నిరంతర చింతనమే మానస స్నానం. ధ్రువుడు పద్మాపతి శ్రీహరిని హృదయ పద్మంలో పదిలపరుచుకున్నాడు. మాధవుని రూపం తప్ప మదిలో మరేదీ లేదు. చిత్తాన్ని భగవదాయత్తం చేసి ధ్రువుడు ధ్యానించసాగాడు. దేహస్థితిని బట్టి మూడు దినాలకు ఒకసారి రేగు, వెలగ మొదలైన వన్య ఫలాలను ఆరగిస్తూ ఒక నెల అచ్యుతుని ఆరాధించాడు. తదుపరి ఆరు దినాలకొకసారి ఎండిన ఆకులు, అలములు తింటూ అర్చనలో రెండో నెల గడిపాడు. తరువాత తొమ్మిదేసి దినాలకు ఒకసారి యమునా జలం తాగుతూ జలజాతేక్షణుని మానస వీక్షిస్తూ కటాక్షానికై నిరీక్షణలో మూడవ మాసం ముగించాడు. అనంతరం పన్నెండు దినాలకు ఒకసారి గాలిని ప్రాశిస్తూ-భుజిస్తూ నాల్గవ మాసంలో పద్మనాభుని పూజించాడు. ఆవల ఐదవ నెలలో ఒంటికాలిపై నిలబడి (‘నాకు ఇక ప్రపంచం కాదు, పరమాత్మ ఒక్కడే ఆధారం’ అని సూచిస్తూ) గాలిని కూడా నిరోధించి గుండెలో గోవిందుని నిలిపి ఎండిన మ్రోడువలె నిశ్చలంగా నిలిచాడు. నిరంతరం స్మరించాడు. ఇలా నెలనెలా తపస్సు తీవ్రతరం చేశాడు. ‘తత్తపోయద్ భవత్ స్మృతిః’- సర్వకాల సర్వావస్థలలో శ్రీహరి స్మరణమే పరమ తపస్సు.
మైత్రేయ ఉవాచ- ‘విదురా! ధ్రువుని తపస్సు వలన పుట్టిన తేజస్సును సహింపలేక ముల్లోకాలు తల్లడిల్లినాయి. అతని ఒంటికాలి బొటన వ్రేలి ఒత్తిడికి నేల ఊగి సగం వంగి క్రుంగింది. విశ్వాత్మకుడైన విష్ణువును తనకు అభిన్నంగా ధ్యానించడం వలన ధ్రువుని వ్యష్టి ప్రాణవాయువు సమష్టి ప్రాణవాయువుతో తాదాత్మ్యం చెందింది. ఆశ్చర్యంగా భక్త బాలుని ప్రాణ నిరోధం వలన జగత్తుకి, జగజ్జాలునికి (విష్ణువుకి) కూడా ప్రాణ నిరోధమయింది.
(సశేషం)
కం॥ చని ముందటఁ గనుగొనె మధు
వనమును ముని దేవ యోగి వర్ణిత గుణ పా
వనమును దుర్భవ జలద ప
వనమును నిఖిలైక పుణ్యవర భవనంబున్’
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006