న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: దేశంలో సగటున ప్రతీ గంటకు మూడు రేప్లు, మూడు హత్యలు నమోదవుతున్నాయి. 2020లో దేశవ్యాప్తంగా 28,153 మందిపై లైంగిక దాడి జరిగింది. వీరిలో 2,655 మంది పద్దెనిమిదేండ్ల లోపువారు. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) ఈ వివరాలను వెల్లడించింది. 2020లో జరిగిన నేరాలపై నివేదికను బుధవారం విడుదల చేసింది. రోజూ 77 రేప్లు, 80 మర్డర్లు జరుగుతున్నాయని పేర్కొన్నది. 2020లో 29,193 హత్యలు నమోదైనట్టు తెలిపింది. హత్య కేసుల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో హత్యలు 1% పెరిగాయి. 2019లో 28,915 హత్య కేసులు నమోదయ్యాయి. 2020లో 84,805 మంది కిడ్నాప్ అవగా.. వీరిలో పిల్లలు 56,591 మంది. మొత్తంగా మహిళలపై వివిధ నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 3,71,503 కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు ఏడాది 4,05,326గా ఉంది. 2019తో పోల్చితే 2020లో దేశంలో దొంగతనం, దోపిడీ, మహిళలపై దాడులు తగ్గాయి. అయితే ప్రభుత్వం ఆదేశాల ఉల్లంఘన భారీగా పెరిగింది. ఇందులో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనదే సింహభాగం.
2019 – 51,56,158
2020 – 66,01,285