మహారాష్ట్ర : అమరావతి ఎంపీ నవనీత్ రాణా గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ముంబైలోని బోరివాలి కోర్టు విడుదల చేయాలని ఆదేశించడంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. నవనీత్తో పాటు ఆమె భర్త రాణాకు సైతం కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేయడంతో న్యాయవాది ముంబైలోని బైకుల్లా జైలులో అందజేశారు. అయితే, కోర్టు ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఇద్దరూ జైలు నుంచి విడుదలకావడంలో ఆలస్యం జరిగింది. సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. దంపతులిద్దరూ రూ.50వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడొద్దని నవనీత్ కౌర్ దంపతులకు న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఆదేశాలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇదే సమయంలో నవనీత్ రాణా దంపతులను విచారణకు పిలవాలంటే 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించింది. అలాగే విచారణకు సహకరించాలని నవనీత్ దంపతులకు సూచించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని చేసిన ప్రకటన మేరకు నవనీత్ దంపతులను గత నెల 23న మహారాష్ట్ర పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. నవనీత్ కౌర్ రాణా కుల ధ్రువీకరణపత్రానికి సంబంధించిన కేసుపై విచారణను సుప్రీం కోర్టు జూలైకి వాయిదా వేసింది. గతేడాది బాంబే హైకోర్టు నవనీత్ రాణా కుల ధ్రువీకరణ పత్రాన్ని తిరస్కరించింది.