ఆఫ్గనిస్తాన్ తాలిబాన్ల హస్తగతమైనప్పటి నుంచి పరిస్థితులు దారుణాతిదారుణంగా తయారయ్యాయని మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. గత నాలుగు నెలల్లో ఆఫ్గన్ కరెన్సీ విలువ ఘోరంగా పడిపోయింది. మొదటి నుంచీ ఆర్థిక సంకటంలోనే కూరుకుపోయిన ఆఫ్గన్… తాలిబాన్ల చేతిలో పడగానే మరింత కుంగిపోయింది. దేశంలోని సగం మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారని రిపోర్టులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ సమాజం ఆఫ్గన్ ఆస్తులను కూడా స్తంభింపజేసింది. దీంతో పరిస్థితి మరింత విషమించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఆఫ్గన్కు 45 కోట్ల డాలర్లు అందాల్సి ఉంది. కానీ తాలిబాన్ల వ్యవహారంపై స్పష్టత లేకపోవడంతో ఆ ద్రవ్యాన్ని నిలుపు చేసింది.
ఆగస్టు ప్రారంభంలో ఒక డాలర్కు 80 ఆప్గానీలు (ఆఫ్గన్ కరెన్సీ) ఉన్న విలువ ఇప్పుడు డాలర్కు 123 ఆప్గనీలకు చేరుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే… అక్కడి ప్రజల దగ్గర డబ్బే లేదు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఆప్గన్ జనాభా 3.8 కోట్ల మందిలో 2.3 కోట్ల మందికి ఆహారం దొరకడమే గగనమైపోయింది. పోషకాహార లోపాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. దేశంలో తీవ్రమైన కరువు ఉందని, కరోనా తదితర కారణాలతో ఆఫ్గన్ పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.