న్యూఢిల్లీ, మే 20: అమెరికాలోని వేలాది భారతీయ టెక్ ఉద్యోగులకు గడిచిన కొన్ని నెలలు కాలంతో పోరాటంగా మారాయి. ఒక్క ఉద్యోగ తొలగింపు ఈమెయిల్ హఠాత్తుగా ఒకరి జీవితాన్నే ప్రమాదంలో పడేయగలదు. ఉద్యోగాలు, ఇళ్లు, పిల్లల చదువులు, చివరికి దేశంలో నివసించే హక్కుకు కూడా ముప్పు వాటిల్లవచ్చు. మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటంతో అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనలు విధించిన కఠినమైన 60 రోజుల గడువు కారణంగా హెచ్-1బీ వీసాలపై నివసిస్తున్న చాలా మంది భారతీయులు ఇప్పుడు జీవనోపాధి కోసం పోరాడుతున్నారని ఎకనమిక్ టైమ్స్ తాజా కథనం సూచిస్తున్నది.
హెచ్-1బీ విధానం కింద ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ ఉద్యోగులకు తమకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మరో యజమానిని కనుగొనడానికి కేవలం 60 రోజుల సమయం మాత్రమే లభిస్తుంది. ఒకవేళ వారు విఫలమైతే అమెరికా విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అక్కడ తమ జీవితాలను నిర్మించుకోవడానికి పలు సంవత్సరాలు గడిపిన చాలా మంది భారతీయులకు ఈ ఒత్తిడి దుర్భరంగా మారుతున్నది. మరింత గడువు సంపాదించుకోవడానికి ఉద్యోగాలు కోల్పోయిన పలువురు ఉద్యోగులు ఇప్పుడు తాత్కాలికంగా బీ-2 విజిటర్ వీసాలకు మారడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ వీసా ద్వారా వారు ఆరు నెలల వరకు అమెరికాలో ఉండవచ్చు. కానీ ఆ మార్గం కూడా అంతకంతకూ కష్టతరం అవుతున్నదని ఇమిగ్రేషన్ నిపుణులు అంటున్నారు.
ఇమిగ్రేషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉద్యోగాలు కోల్పోయి బీ-2 హోదాకు మారడానికి ప్రయత్నిస్తున్న హెచ్-1బీ ఉద్యోగులకు అధికారులు ఇప్పుడు అదనపు పత్రాలను కోరుతూ మరిన్ని వీసాలను తిరస్కరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే చట్టబద్ధమైనదే అయినప్పటికీ అనుమతులు పొందడం కష్టతరం అవుతున్నది. టెక్ రంగమంతటా భారీగా లేఆఫ్లు జరగడంతో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. 2026లో ఇప్పటివరకు 144 టెక్ కంపెనీల్లో 1.10 లక్షల మందికిపైగా తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు లేఆఫ్స్ ఎష్వైఐ నివేదిక పేర్కొన్నది. వీరిలో వేలాది మంది హెచ్-1బీ ఉద్యోగులు ఉండవచ్చని, వారిలో చాలామంది భారతీయులేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్-1బీ వీసా పథకం ద్వారా భారతీయులే అతిపెద్ద లబ్ధిదారులుగా కొనసాగుతున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన 4,06,348 హెచ్-1బీ పిటిషన్లలో 2,83, 772 పిటిషన్లు భారతీయులవే. అదే ఇప్పుడు ఒక పెద్ద బలహీనతగా మారిపోయింది.