న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో తాజాగా చేపట్టిన సర్వేలో శివలింగం బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వారణాసి కోర్టు విచారణ ఆపేయాలని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. జ్ఞానవాపి మసీదు కేసును శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది. మసీదులో తీసిన వీడియో రిపోర్ట్ను ఇవాళ వారణాసి కోర్టులో సమర్పించారు. మసీదు లోపల ఉన్న హిందూ దేవుళ్లను పూజించేందుకు అనుమతి ఇవ్వాలని స్థానిక హిందూ మహిళలు పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. కోర్టు నియమించిన కమిషనర్ విశాల్ సింగ్కు వీడియోలు, ఫోటోలను సమర్పించారు. మసీదులో వీడియోగ్రఫీని నిలిపివేయాలని మసీదు కమిటీ వేసిన పిటిషన్పై ఎటువంటి ఆదేశాలు ఇవ్వవద్దు అని ఇవాళ సుప్రీం తన తీర్పులో పేర్కొన్నది.