Gyanvapi Survey | కాశీ జ్ఞానవాపి కాంప్లెక్స్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. సర్వే నివేదిక సంబంధించిన కాపీ ఇవ్వాలని కేసులో రెండు (హిందు-ముస్లిం) పార్టీలు గురువారం కోర్టులో దరఖాస్తు చేశాయి. రెండు పార్టీలకు త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా నివేదికకు సంబంధించిన హార్డ్ కాపీ లభించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. జ్ఞానవాపి కాంప్లెక్స్లో సర్వే ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించి 800 పేజీల నివేదికను ఈ-మెయిల్ ద్వారా బుధవారం కోర్టుకు సమర్పించింది. నివేదిక సైతం అందినట్లు కోర్టు ధ్రువీకరించింది.
ఇరుపక్షాలు నివేదిక జిల్లా కోర్టులోని ట్రెజరీలో రూ.3500 డిపాజిట్ చేసి నివేదిక తీసుకోవాల్సి ఉంటుంది. జ్ఞాన్వాపీ కాంప్లెక్స్కు చెందిన ఏఎస్ఐ సర్వే నివేదికను అన్ని పార్టీలకు, డీపీకి ఇవ్వాలని జిల్లా జడ్జి డాక్టర్ అజయ్కృష్ణ ధర్మాసనం ఆదేశించింది. సర్వే నివేదిక విషయంలో మీడియా కవరేజీపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. న్యాయస్థానం ఈ సర్వే న్యాయం కోసమేనని పేర్కొంది. సర్వే నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు వీలుగా నివేదిక కాపీని పార్టీలకు ఇవ్వడం సముచితంగా ఉంటుందని తెలిపింది.
ఈ సందర్భంగా హిందూ సంఘం తరఫు న్యాయవాది హరిశంకర్ జైన్ మాట్లాడుతూ మసీదు నిర్మాణానికి ముందు మందిరం కూల్చినట్లు చూపించేందుకు ఆధారాలు ఉన్నాయన్నారు. తాము విజయానికి చేరువలో ఉన్నామన్నారు. సర్వే నివేదిక వాజుఖానాలోని ఉన్నది శివలింగమా..? లేక ఫౌంటైనా..? తేలుతుదన్నారు. వాజుఖనాలోని బావిలోని చేపలు చనిపోవడంతో వాటిని క్లీనింగ్ కోసం కోర్టులో దరఖాస్తు చేశామని.. ఏఎస్ఐ సర్వే కోసం సుప్రీం కోర్టులో దరఖాస్తు చేస్తామన్నారు. సర్వేపై స్టే తొలగించాలని కోరామని.. ప్రస్తుతం కస్టడీ వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ఉందన్నారు. ఏఎస్ఐ నివేదిక వచ్చిన తర్వాత తాము విజయం అంచున ఉంటామని చెప్పగలనన్నారు.