చండీగఢ్: ముస్లిం సోదరుల శుక్రవారం ప్రార్థనల కోసం గురుద్వారా కమిటీ తలుపులు తెరిచింది. గురుద్వారాలో శుక్రవారం రోజు నమాజ్ చేసుకోవచ్చని కమిటీ పిలుపునిచ్చింది. హర్యానాలోని గురుగ్రామ్లో బహిరంగ ప్రదేశాలలో శుక్రవారం ముస్లింల ప్రార్థనలపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల శుక్రవారం ప్రార్థనలు జరుగకుండా పలు చోట్ల స్థానికులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో గురుగ్రామ్ సదర్ బజార్లోని గురుద్వారా అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం ప్రార్థనల కోసం గురుద్వారా ప్రాంగణాన్ని ముస్లిం సోదరులు వినియోగించుకోవచ్చని తెలిపింది. ‘ఇది ‘గురు ఘర్’. ఎటువంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల కోసం తెరిచి ఉంది. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు ఉండకూడదు. ముస్లిం సోదరుల నమాజ్ కోసం బేస్మెంట్ను తెరుస్తాం’ అని సదర్ బజార్ గురుద్వారా అధ్యక్షుడు షెర్దిల్ సింగ్ సిద్ధూ అన్నారు.
ఖాళీ ప్రదేశాలు కలిగిన వారు అధికారుల పర్మిషన్తో శుక్రవారం ప్రార్థనల కోసం అనుమతించవచ్చని ఆయన తెలిపారు. అభ్యంతరం ఉన్న వారు దాడులకు ముందు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఇలాంటి చిన్న విషయాల కోసం ఘర్షణ పడకూడదని సూచించారు.
కాగా, గురుగ్రామ్లోని 37 బహిరంగ ప్రదేశాల్లో శుక్రవారం జరిగే ముస్లింల ప్రార్థనల కోసం అధికారులు అనుమతించారు. అయితే స్థానికుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు, నిరసనల నేపథ్యంలో 8 చోట్ల ఈ అనుమతిని గురుగ్రామ్ అడ్మినిష్ట్రేషన్ ఇటీవల రద్దు చేసింది.