న్యూఢిల్లీ: ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ కురువృద్ధుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఈ విషయమై ఆయన సన్నిహిత వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇటీవల ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆజాదే స్వయంగా కొత్త పార్టీ ఏర్పాటుపై సంకేతాలిచ్చారు.
తాను జమ్ముకశ్మీర్కు వెళ్తున్నానని, అక్కడ సొంత పార్టీని ఏర్పాటు చేస్తానని ఆజాద్ చెప్పారు. జాతీయపార్టీ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను కూడా తర్వాత పరిశీలిస్తానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జమ్ముకశ్మీర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి 73 ఏండ్ల గులాంనబీ ఆజాద్కు కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఎన్నో కీలక పదవులను కట్టబెట్టింది. ఈ మధ్య కూడా జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిని ఆఫర్ చేయగా.. పార్టీ తన సూచనలను పెడచెవిన పెడుతోందన్న కారణంగా ఆ ఆఫర్ను తిరస్కరించారు. ఇవాళ పార్టీ అధిష్ఠానాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రాజీనామా లేఖ పంపారు.
తన ఐదు పేజీల రాజీనామా లేఖలో గాంధీల కుటుంబాన్ని ముఖ్యంగా రాహుల్గాంధీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. రాహుల్గాంధీది చిన్నపిల్లవాడి ప్రవర్తన అని, ఆయన మానసిక పరివర్తన లేదని విమర్శించారు. అనుభవం లేని భజనపరుల కోటరీకి రాహుల్ పార్టీని నడిపించే బాధ్యత అప్పగించారని మండిపడ్డారు.