జమ్ము: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్.. 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆజాద్ సన్నిహితుడు, జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి జీఎం సరూరీ వెల్లడించారు. జమ్ముకశ్మీర్లో 2019, ఆగస్టు 5వ తేదీకి ముందున్న స్థితిని పురుద్ధరించాలనే అంశాన్ని తమ పార్టీ మ్యానిఫెస్టోలో చేరుస్తామని ఆయన తెలిపారు.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఆయనకు మద్దతుగా సరూరీ కూడా రాజీనామా చేశారు. ఆయనతోపాటు జమ్ముకశ్మీర్కు చెందిన చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. వీళ్లేగాక వందల సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు.
ఆజాద్ బీజేపీలో చేరుతాడన్న వార్తలను సరూరీ కొట్టిపారేశారు. తమ నాయకుడు సిద్ధాంతాలపరంగా లౌకికవాది అని, ఆయన బీజేపీ పక్కన చేరే అవకాశమే లేదని చెప్పారు. సెప్టెంబర్ 4న ఆజాద్ జమ్ముకశ్మీర్కు వస్తున్నారని, అదేరోజు పార్టీ ఏర్పాటుపై స్థానిక నేతలతో చర్చించనున్నారని తెలిపారు. ముందుగా రాష్ట్రస్థాయిలో పార్టీని ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత జాతీయ పార్టీ విషయాన్ని పరిశీలిస్తామని సరూరీ పేర్కొన్నారు.