అహ్మదాబాద్: సీఎం పాల్గొన్న కార్యక్రమంలో ఒక అధికారి నిద్రపోయాడు. ఇది మీడియా కంటపడింది. దీంతో ఆ అధికారిని సస్పెండ్ చేశారు (Gujarat Officer Suspended). బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. కచ్ జిల్లాలోని భుజ్లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. 2001లో భుజ్లో సంభవించిన భూకంప బాధిత ప్రజలకు పునరావాసం కింద ఇచ్చిన నివాస గృహాల పత్రాలను 14,000 మందికి పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
కాగా, సీఎం కార్యక్రమంలో పాల్గొన్న భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ ఈ సందర్భంగా కునుకు తీశారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా కెమేరాల కంటపడ్డారు. ఈ నేపథ్యంలో కార్యక్రమం ముగిసిన కొన్ని గంటల్లోనే ఆ అధికారిపై చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడం, దుష్ప్రవర్తన, విధుల్లో బాధ్యతారాహిత్యం వంటి ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేశారు. గుజరాత్ పట్టణాభివృద్ధి, పట్టణ గృహ నిర్మాణ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు అందులో పేర్కొంది.