గువాహటి, ఏప్రిల్ 25: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని మరో కొత్త కేసులో అస్సాం పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ప్రధాని మోదీపై అభ్యంతరకరమైన ట్వీట్లు చేశారన్న ఆరోపణలతో గత గురువారం మేవానీని తొలిసారి అరెస్టు చేశారు. కోక్రాఝర్ జైలుకు తరలించారు. సోమవారమే బెయిల్ లభించింది. అయితే, మేవానీ జైలు నుంచి విడుదల కాకముందే అస్సాంలోని గోల్పారా పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. మేవానీని మళ్లీ అదుపులోకి తీసుకొన్నారు. కానీ, మేవానీపై నమోదైన కొత్త కేసు ఏంటనేది చెప్పలేదు. ప్రభుత్వాధికారిపై దాడిచేసి విధులకు భంగం కలిగించాడన్న ఆరోపణలతో మేవానీని మళ్లీ అరెస్టు చేసినట్టు అధికార వర్గాలు తరువాత తెలిపాయి.
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
గుజరాత్లో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మేవానీని అస్సాం పోలీసులు కేసు ఏంటనేది కూడా చెప్పకుండా అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మేవానీ.. ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానని ప్రకటించారు. మేవానీ అరెస్టును దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీగా కాంగ్రెస్ అభివర్ణించింది.