అహ్మదాబాద్: ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అధికారినంటూ ఒక వ్యక్తి ప్రైవేట్ స్కూల్ను మోసగించేందుకు ప్రయత్నించాడు. ఆ మోసాన్ని గ్రహించిన ఆ స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిని (Gujarat Man) అరెస్ట్ చేశారు. గుజరాత్లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది. మయాంక్ తివారీ అనే వ్యక్తి పీఎంవోలో వ్యూహాత్మక సలహా విభాగం డైరెక్టర్గా పరిచయం చేసుకున్నాడు. 2022 మార్చిలో స్కూల్ అడ్మిషన్ల సమయంలో ఒక ప్రైవేట్ స్కూల్ను వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. ఆర్మీ అధికారి అయిన తన స్నేహితుడికి పూణే నుంచి వడోదరకు ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పాడు. వారి ఇద్దరు కుమారుల అడ్మిషన్కు సహకరించాలని ఆ స్కూల్ డైరెక్టర్ను కోరాడు. దీంతో స్కూల్ ట్రస్టీని సంప్రదించాలని ఆ డైరెక్టర్ సూచించారు.
కాగా, స్కూల్ ట్రస్టీ అయిన మహిళను మయాంక్ తివారీ సంప్రదించాడు. తన స్నేహితుల పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడంతోపాటు వారి చదువు ఖర్చులు భరించాలని చెప్పాడు. దీనికి బదులుగా తన పీఎంవో అధికారాన్ని ఉపయోగించి విద్యా పరిశోధన రంగానికి చెందిన ప్రాజెక్టులు ఆ స్కూల్కు వచ్చేలా సహాయం చేస్తానని నమ్మించాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మిన ఆ స్కూల్ యాజమాన్యం అతడు చెప్పిన ఇద్దరు పిల్లలకు అడ్మిషన్ ఇచ్చింది.
మరోవైపు కొన్ని నెలల తర్వాత పీఎంవో అధికారిగా పేర్కొన్న తివారీపై ట్రస్టీ మహిళకు అనుమానం వచ్చింది. తనకు తెలిసిన ప్రముఖుల ద్వారా అతడి గురించి ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తివారీ పీఎంవో అధికారి కాదని తెలిసింది. తమ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేందుకు అతడు కుట్ర పన్నినట్లు ఆమె అనుమానించింది. అతడి మోసంపై స్కూల్ డైరెక్టర్ను అలెర్ట్ చేసింది. దీంతో గత నెలలో మయాంక్ తివారీపై ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.