గుజరాత్లోని కసోటియా గ్రామంలో 300 వరకు ఇండ్లు ఉన్నాయి. అయితే, ఒక్క ఇంటికి కూడా తాగునీరు సరఫరా కావట్లేదు. దీంతో చంకలో పిల్లలతో 2, 3 కిలోమీటర్ల దూరంలోని బావుల నుంచి మహిళలు నీటిని తెచ్చుకొంటున్నారు. గ్రామంలో కొన్ని ఇండ్లకు ఏడాది క్రితమే నల్లా కనెక్షన్ ఇచ్చినప్పటికీ, నీటి సరఫరా మాత్రం జరుగట్లేదు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న 91.7 లక్షల గ్రామీణ కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చి, 100 శాతం ఇండ్లకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నాం’.. గత నెలలో గుజరాత్ సర్కారు ఆర్భాటంగా చేసిన ప్రకటన ఇది. అయితే, గుజరాత్లో దాహోద్ జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగట్లేదు.
ఈ మేరకు జాతీయ మీడియా సంస్థ ‘ఎన్డీటీవీ’ క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైంది. కసోటియా గ్రామంలో 300 వరకు ఇండ్లు ఉన్నాయి. అయితే, ఒక్క ఇంటికి కూడా తాగునీరు సరఫరా కావట్లేదు. దీంతో పిల్లలను చంకలో వేసుకొని 2, 3 కిలోమీటర్ల దూరంలోని బావి నుంచి మహిళలు నీటిని తెచ్చుకొంటున్నారు. గ్రామంలో కొన్ని ఇండ్లకు ఏడాది క్రితమే నల్లా కనెక్షన్ ఇచ్చినప్పటికీ, నీటి సరఫరా మాత్రం జరుగట్లేదు. అయితే, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే బచుబాయ్ కబాడ్ ఈ వార్తలను తోసిపుచ్చారు. ‘100% నల్లా కనెక్షన్లు పూర్తయినట్టు గతనెలలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ ఫీట్ను ఏడాది క్రితమే సాధించాం’ అని చెప్పుకొచ్చారు.
గుజరాత్లో కల్తీసారా తాగి ఇద్దరి మృతి
జునాగఢ్, నవంబర్ 29: మద్యనిషేధం అమలులో ఉన్న గుజరాత్లో కల్తీసారా తాగి ఇద్దరు మృత్యువాతపడ్డారు. జునాగఢ్ జిల్లాలోని గాంధీచౌక్ ఏరియాలో రఫీక్ ధోధరి (45), భరత్ పిధాడియా (40) అనే ఆటోరిక్షా డ్రైవర్లు సోమవారం అనుమానాస్పద లిక్కర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని అడిషనల్ డీజీపీ రాజ్కుమార్ పాండ్యన్ తెలిపారు. వెంటనే దవాఖానకు తీసుకెళ్లినా ఫలితం లేదని, వాళ్లు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తేల్చారన్నారు. విషపూరిత పదార్థం వల్ల వారి శరీరంలోని అంతర్గత అవయవాలు చెడిపోయాయని పోస్టుమార్టం నివేదికలో తేలిందన్నారు.
తాము వెంటనే వారు తాగిన లిక్కర్ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపామని, అందులో ఇథనాల్, సైనైడ్ ఉన్నట్టు తేలిందన్నారు. వారికి కల్తీసారా ఎవరు సరఫరా చేశారనేదానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. గుజరాత్ ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తీవ్రంగా స్పందించారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్లాంటి మహాత్ముల నేలను మత్తులో ముంచుతున్నారని ధ్వజమెత్తారు. గుజరాత్లో మద్యపానంపై నిషేధం ఉన్నా.. లిక్కర్, డ్రగ్స్వల్ల జనాలు చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బిడ్డను అప్పజెప్పి వెళ్తా..
నాకు ఏడాది బిడ్డ. చిన్నారిని పట్టుకొని రెండు కిలోమీటర్ల దూరం నీటి కోసం ఎలా వెళ్లగలను? ఎవరికైనా బిడ్డను అప్పజెప్పి. రోజూ నీళ్లు తెచ్చుకొంటూ ఉంటా.
-వేషన్ బెన్, కసోటియా
జీఎస్డీపీలో తెలంగాణ టాప్
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ కంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీఎస్డీపీ) వృద్ధి రేటులో తెలంగాణ ఎంతో ముందంజలో ఉన్నది. గడిచిన ఐదేండ్లలో గుజరాత్ జీఎస్డీపీ వృద్ధి రేటు 10 శాతం నమోదవ్వగా, తెలంగాణ జీఎస్డీపీ వృద్ధిరేటు 11.2 శాతంగా నమోదైంది. ‘గుజరాత్ మాడల్’ అంటూ సాక్షాత్తూ ప్రధాని గొప్పగా చెప్పుకొంటున్న రాష్ట్రం ప్రగతి ఇది.
రోజూ తల్లడిల్లాల్సిందే!
’12 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. నా ఇంట్లో నల్లా కనెక్షన్ లేదు. నీటి కోసం రోజూ తల్లడిల్లాల్సిన పరిస్థితి. ఎండాకాలంలో చేతి పంపు నుంచి కూడా నీళ్లు రావు’
-కసోటియా గ్రామస్థురాలు