(స్పెషల్ టాస్ బ్యూరో నమస్తే తెలంగాణ)
పేదలకు ఉచితాలు వద్దని, అవి దేశ అభివృద్ధికి ప్రతిబంధకమంటూ వేదాలు వల్లించే ప్రధాని మోదీ, బీజేపీ నేతలు తమ కార్పొరేట్ స్నేహితులకు లబ్ధి చేకూర్చేందుకు ఆరాటపడుతున్నారు. అదానీ విషయంలో మోదీ, బీజేపీ నేతల ఆత్రుత వేరే లెవల్లో ఉంటున్నది. గుజరాత్లోని ముంద్రా పోర్టు కోసం సమీకరించిన భూమికి సంబంధించిన కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. అటవీ భూమి క్యాటగిరీ మార్చి చూపి.. గుజరాత్ బీజేపీ ప్రభుత్వం తక్కువ ధరకే అదానీ కంపెనీకి కట్టబెట్టిన విషయాన్ని ఆ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) బయటపెట్టింది. అంతకు ముందు కూడా ఈ అంశాన్ని కాగ్ తప్పుబట్టింది. శాసనసభలో విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో పెద్ద దుమారమే చెలరేగుతున్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పును సైతం లెక చేయకపోవడం గమనార్హం.
ముంద్రా పోర్టు కోసం నిబంధనలకు నీళ్లు ముంద్రా పోర్టు కోసం సమీకరించిన భూమి వ్యవహారంలో గుజరాత్ సర్కారు నిబంధనలకు నీళ్లు వదలింది. గుజరాత్ రాష్ట్ర ఖజానాకు రూ.58.64 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదికను ఉటంకిస్తూ పీఏసీ గుజరాత్ అసెంబ్లీకి నివేదిక సమర్పించింది. బయటి మార్కెట్ రేటు ప్రకారం ఆ భూమి విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా. కచ్ జిల్లాలో ప్రతిపాదిత ముంద్రా పోర్టు కాంట్రాక్టును అదానీ కెమికల్స్ సంస్థ దకించుకొన్నది. దీని కోసం ప్రభుత్వం అటవీ భూమిని సమీకరించింది. క్యాటగిరీ మార్చి హెక్టారు ధర రూ.7.3 లక్షలకు బదులుగా రూ.4.3 లక్షలుగా తప్పుగా చూపడం వల్ల సదరు కంపెనీకి ప్రభుత్వం లబ్ధి చేకూర్చినట్టు కాగ్ తప్పుపట్టింది. ఖజానా నష్టపోయిన రూ.58 కోట్లను అదానీ కంపెనీ నుంచి వసూలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి పీఏసీ సిఫారసు చేసింది.