అహ్మదాబాద్: 1960లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మద్యనిషేధం అమల్లో ఉన్న గుజరాత్లో తొలిసారిగా గిఫ్ట్ సిటీలో మద్యం విక్రయాలకు అక్కడి బీజేపీ సర్కారు అనుమతినిచ్చింది. సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో మద్యం వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
గిఫ్ట్ సిటీలో మద్య నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్, ఆప్ దుయ్యబట్టాయి. ఇది యువతను నాశనం చేసే దురదృష్టకర నిర్ణయమని మండిపడ్డాయి. కాంగ్రెస్ నేత అమిత్ చావ్డా మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తివేయాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. నేడు ఇది గిఫ్ట్ సిటీ నుంచి ప్రారంభమైందని, రేపు కేవడియాలోని సమైక్యతా విగ్రహం వద్దకు చేరుతుందని, ఆ తర్వాత సూరత్ డైమండ్ బౌర్సేలో కూడా పర్యాటకులను ఆకర్షించడం కోసమంటూ మద్య నిషేధాన్ని ఎత్తివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.