Gujarat Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరుగనున్నాయి. ఈ క్రమంలో పార్టీల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార బీజేపీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం గుజరాత్లో మకాం వేశారు. పంచమహల్ జిల్లాలో ఆదివారం రోడ్షో నిర్వహించారు. రోడ్షోలో పలువురు మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘ఏదో ఒక రోజు మోదీ మద్దతుదారుల హృదయాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుంది’ అన్నారు.
పంచమహల్ జిల్లాలోని హలోల్ వద్ద ఆదివారం సాయంత్రం సంఘటన జరిగింది. కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా.. జనం మధ్యలో ఉన్న కొందరు మోదీ మోదీ అంటూ నినదించారు. కేజ్రీవాల్ మట్లాడుతూ ‘కొందరు మిత్రులు మోదీ మోదీ అని అరుస్తున్నారు. మీలో ఎవరైనా ఆయనకు మద్దతుగా నినాదాలు చేయవచ్చు. వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ మీ పిల్లలకు పాఠశాలలు నిర్మిస్తారు. మోదీకి మద్దతుగా ఏ నినాదాలు చేసినా కేజ్రీవాల్ మీకు ఉచిత విద్యుత్ ఇస్తారు. ఇంకా ఎవరితో మాకు శత్రుత్వం లేదు. ఎవరికి కావాలంటే వారికి మద్దతుగా నినాదాలు చేయొచ్చు.
ఏదో ఒక రోజు మీ మనసు గెలిచి మా పార్టీలోకి తీసుకువస్తాం’ అన్నారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తామని పునరుద్ఘాటించారు. పాఠశాలల గురించి మాట్లాడే పార్టీ ఏదీ లేదన్న ఆయన.. పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తామని.. ఉద్యోగాలు, ఉచిత కరెంటు ఇస్తామని ఏ పార్టీ అయినా హామీ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. ఈ సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే మాట్లాడుతుందన్నారు. గుండాయిజాన్ని నమ్మి.. దుర్భాషలాడేందుకు ఇష్టపడితే ప్రజలు బీజేపీకే మద్దతు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.