అహ్మదాబాద్, జూలై 18: స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు కావొస్తున్నప్పటికీ దేశంలో ఇంకా అంటరానితనం పోలేదనడానికి రోజూ జరుగుతున్న ఘటనలే సాక్ష్యం. అమృత మహోత్సవాల పేరిట ఏడాదిగా దేశవ్యాప్తంగా సంబురాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై తమ ఇండ్లల్లోని ఇత్తడి పాత్రలను కరిగించి తయారు చేసిన భారీ నాణేన్ని ప్రతిష్టించాలని కోరుతూ గుజరాత్, రాజస్థాన్, హర్యానాకు చెందిన వందలాది మంది దళితులు ఆగస్టు తొలివారంలో ఢిల్లీ వెళ్లనున్నారు. తమతో పాటు వెయ్యి కిలోల బరువు, 10 అడుగుల ఎత్తు, 2,047 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన భారీ నాణేన్ని కూడా రైలులో తీసుకువెళ్లనున్నారు. 2,450 కిలోల ఇత్తడి పాత్రలను కరిగించి ఈ నాణేన్ని తయారుచేసినట్టు నవ్సర్జన్ ట్రస్ట్ సభ్యుడు మార్టిన్ మక్వాన్ తెలిపారు. సెంట్రల్ విస్టా భవనంపై నాణేన్ని ప్రతిష్టించాల్సిందిగా రాష్ట్రపతికి త్వరలో లేఖ రాయనున్నట్టు పేర్కొన్నారు. అంబేడ్కర్, బుద్ధుడి రూపాలు ముద్రించిన ఈ భారీ నాణెంపై 15 భాషల్లో ‘అంటరానితనం’ అని రాసి ఉన్నది.