ముంబై: బ్రెయిన్ స్ట్రోక్ (Brain stroke)తో ఆదివారం అహ్మదాబాద్ (Ahmedabad)లోని కేడీ ఆస్పత్రి (KG Hospital) లో చేరిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) కుమారుడు అనూజ్ పటేల్ (Anuj Patel) ను ఇవాళ ఎయిర్ అంబులెన్స్లో ముంబైలోని హిందూజా ఆస్పత్రి (Hinduja Hospital) కి తరలించారు. అక్కడ ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నారు.
అనూజ్ పటేల్ ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రోక్కు గురికావడంతో ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆయనను హుటాహుటిన అహ్మదాబాద్లోని కేడీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ వెంటనే శస్త్రచికిత్స చేసిన కేడీ ఆస్పత్రి వైద్యులు.. అనూజ్ పటేల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని ఆదివారం రాత్రి ప్రకటించారు. 24 గంటల అబ్జర్వేషన్ అనంతరం ఇవాళ మెరుగైన చికిత్స కోసం అయనను ముంబైలోని హిందూజా ఆస్పత్రికి తరలించారు.
అనూజ్ పటేల్ను ఐసీయూలో ఉంచి తదుపరి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని, పూర్తిగా కోలుకోవడానికి ఆయన మరికొన్ని రోజులు ఐసీయూలో ఉండాల్సి వస్తుందని హిందూజా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా, కొడుకు అనారోగ్యం నేపథ్యంలో ఇవాళ జామ్నగర్లో నిర్వహిస్తున్న గుజరాత్ రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్యమంత్రి వెళ్లలేకపోయారు. అయితే, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి సమక్షంలో ఆ కార్యాక్రమం జరిగిందని అధికారులు చెప్పారు.