అహ్మదాబాద్: గుజరాత్లో రేపు కొత్త మంత్రివర్గం ( New Cabinet ) కొలువుదీరనుంది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు గాంధీనగర్లోని రాజ్భవన్లో మంత్రుల ప్రమాణస్వీకారం జరుగనుంది. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ వారిచేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి యామల్ వ్యాస్ మీడియాకు వెల్లడించారు. అటు గవర్నర్ దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న మనీష్ భరద్వాజ్ కూడా రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరుగనుందని ప్రకటించారు.
బుధవారం మధ్యాహ్నమే నూతన మంత్రుల ప్రమాణస్వీకారం జరుగనుందని ఈ ఉదయం ప్రచారం జరిగింది. బీజేపీ అధికార ప్రతినిధి యామల్ వ్యాస్ కూడా మధ్యాహ్నం 2.00 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరుగనుందని ప్రకటించారు. ఈ మేరకు రాజ్భవన్ ముందు ఓ పోస్టర్ కూడా వెలిసింది. అయితే, ఏం జరిగిందో ఏమో తీర మధ్యాహ్నం సమయంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని గురువారానికి వాయిదా వేసినట్లు ప్రకటించారు. అయితే వాయిదాకుగల కారణాలు వెల్లడించలేదు.