న్యూఢిల్లీ: దుస్తులు, చెప్పులపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పెంచుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనిపై 2022, ఫిబ్రవరిలో జరిగే జీఎస్స్టీ మండలి 47 సమావేశంలో మరోసారి చర్చించాలని సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దుస్తులు, చెప్పులపై 5 శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచుతున్న కేంద్రం ఇటీవల ప్రకటించింది. పెంచిన జీఎస్టీ 2022, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.
అయితే దీనిపై చేనేత కార్మికులు, వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రేట్లు పెంచడంవల్ల చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని వాళ్లు ఆందోళనకు వెలిబుచ్చాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కూడా కేంద్రం నిర్ణయంపై అభ్యంతరం తెలిపాయి. దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం దుస్తులు, చెప్పులపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి 46వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.