శ్రీహరికోట, ఆగస్టు 12: ఇస్రో గురువారం చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 ప్రయోగం విఫలమైంది. భూ పరిశీలన కోసం రూపొందించిన ఈవోఎస్-03 (జీఐశాట్-1) ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే క్రమంలో క్రయోజెనిక్ దశలో (మూడో దశలో) సాంకేతిక సమస్య తలెత్తిందని, ప్రయోగం విఫలమైందని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 10ను ప్రయోగించారు. నీటి వనరులు, అడవులు, వ్యవసాయం, ప్రకృతి విపత్తులపై హెచ్చరికలు, భౌగోళిక సరిహద్దులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. గతేడాది మార్చి 5నే జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 ప్రయోగాన్ని చేపట్టాలని తొలుత నిర్ణయించారు. సాంకేతిక సమస్యలు, కరోనా కారణంగా పలుమార్లు వాయిదా వేశారు.
జీఎస్ఎల్వీతో ఇబ్బందే
చంద్రయాన్, గగన్యాన్ వంటి భారీ మిషన్ల కోసం జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ను (జీఎస్ఎల్వీ) ఇస్రో వినియోగిస్తున్నది. జియోసింక్రనస్ కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు కూడా ఇదే వాహకనౌకను వాడుతున్నది. అయితే తక్కువ దూరాల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు వినియోగిస్తున్న పోలార్ శాటిలైట్ లాంచ్ వేహికిల్ (పీఎస్ఎల్వీ)తో పోలిస్తే, జీఎస్ఎల్వీ సక్సెస్ రేటు తక్కువే. ఇప్పటివరకు జీఎస్ఎల్వీ రాకెట్ సాయంతో 14 ప్రయోగాలు చేపట్టగా ఇందులో 8 విజయవంతంకాగా, 6 విఫలమయ్యాయి. ఇదే సమయంలో పీఎస్ఎల్వీ వాహకనౌక ద్వారా ఇప్పటివరకూ 53 మిషన్లు చేపట్టగా, ఇందులో 50 ప్రయోగాలు సక్సెస్ సాధించాయి. కేవలం మూడు మాత్రమే విఫలమయ్యాయి.