బరేలీ: పీటల దాకా వచ్చిన పెండ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు అరుదుగా అప్పుడప్పుడు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి ఘటనలకు ఎక్కువగా వరకట్నమే కారణం అవుతుంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. అయితే ఇక్కడ కారణం మాత్రం వరకట్నం కాదు. బుల్లెట్ బైకు. వధువు తండ్రి బుల్లెట్ బైకు కోసం నగదు సమకూర్చినా పెండ్లి మాత్రం రద్దయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. బరేలీలోని పర్తాపుర్ చౌధరీ గ్రామానికి చెందిన ఖలీల్ ఖాన్ కూతురు కుల్సుమ్కు అదే జిల్లాలోని మరో గ్రామానికి చెందిన జీషన్ ఖాన్తో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరిలో వారి నిశ్చితార్థం జరిగిన సమయంలో వరకట్నానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదు. కానీ, ఖలీల్ ఖాన్ తనకు తోచినంతలో కట్నకానుకలు సిద్ధం చేశారు. పెండ్లి ముహూర్తం రానే వచ్చింది. వధూవరులు వేదికపైకి చేరుకున్నారు.
ఒకటి తర్వాత ఒకటి పౌరోహితుని సమక్షంలో పెండ్లి తంతు కొనసాగుతుంది. ఇంతలో పెండ్లి కొడుకు తనకు బుల్లెట్ బైకు కావాలని తిరకాసు పెట్టాడు. లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఇప్పటికిప్పుడు బుల్లెట్ బైకు కొనడం సాధ్యం కాదని పెండ్లి కూతురు తండ్రి బతిమాలాడు. బైకు కొనకపోతే బైకుకు అయ్యే రూ.2.30 లక్షలు ఇవ్వాలని పెండ్లి కొడుకు డిమాండ్ చేశాడు. దాంతో పెండ్లి కూతురు తండ్రి అప్పటికప్పుడు బంధువుల ద్వారా రూ.2.30 లక్షలు ఏర్పాటు చేశాడు.
ఇక సమస్య తీరిపోయింది, పెండ్లి తంతు ముగిసిపోతుంది అని అంతా భావిస్తున్న సమయంలో పెండ్లి కూతురు పెండ్లి కొడుకుకు ఊహించని షాక్ ఇచ్చింది. బుల్లెట్ కోసం పెండ్లి పీటల మీదనే తన తండ్రిని ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తితో తనకు పెండ్లి వద్దే వద్దని తెగేసి చెప్పింది. తండ్రి సహా పెండ్లికి హాజరైన బంధువులు అంతా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పెండ్లి కూతురు తన మనసు మార్చుకోలేదు. దాంతో వివాహం రద్దయ్యింది.