Next CDS | జనరల్ బిపిన్ రావత్ వారసుడిగా తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) గా ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఖాళీ అయిన సీడీఎస్ పదవిని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టనున్నది. వచ్చే ఐదు నెలల్లో ఆర్మీ చీఫ్గా రిటైర్ కానున్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవణెను ప్రభుత్వం సీడీఎస్గా నియమించే అవకాశాలు ఉన్నాయని పలువురు రిటైర్డ్ మిలిటరీ అధికారులు అంటున్నారు.
తదుపరి సీడీఎస్ నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లోని సీనియర్ కమాండర్లతో కమిటీని ఏర్పాటు చేయనున్నదని సమాచారం. రెండు, మూడు రోజుల్లో త్రివిధ దళాధిపతుల నుంచి వచ్చే సూచనల ఆధారంగా ఈ కమిటీ తుది పేరు ఖరారు చేస్తుంది. అటుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదానికి పంపుతారు.
సీడీఎస్ నియామకంపై రక్షణ మంత్రి ఆమోద ముద్ర వేసిన తర్వాత కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (సీసీఏ) తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాల కథనం. తూర్పు లడఖ్లో చైనా సైన్యంతో వివాద పరిష్కారంలో పనితీరు ఆధారంగా తదుపరి సీడీఎస్గా ఎంఎం నరవణె నియమితులయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఏప్రిల్లో ఆయన ఆర్మీ చీఫ్గా వైదొలగనున్నారు.