హజారీబాగ్: ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పటికే ధన దాహంతో ఆమె లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఓ వ్యాపార సహకార సంఘంలో జరిగిన అవకతవకలను చూసీచూడనట్లుగా ఉండేందుకు ఆమె రూ.20 వేలు లంచం డిమాండ్ చేసింది. అందులో మొదటి విడతగా రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. జార్ఖండ్ రాష్ట్రంలోని కొడెర్మా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మిథాలీ శర్మ ఏడాది క్రితమే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. ఎనిమిది నెలల క్రితం కొడెర్మా జిల్లా కోఆపరేటివ్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఆమెకు తొలి పోస్టింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా ఇటీవల ఆమె కొడెర్మా వ్యాపార్ సహ్యోగ్ సమితిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆ సమితిలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.
అయితే, బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రభుత్వం దృష్టిలో మంచి అధికారిగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని ఆమె చేజార్చుకుంది. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు అంగీకరించి సమితి సభ్యులు.. ఆ తర్వాత విషయాన్ని ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్తో మిథాలీకి రూ.10 వేల లంచం ఇప్పించి.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాంతో కష్టపడి ఉద్యోగం సంపాదించిన మిథాలీ శర్మ ఏడాది కూడా తిరక్కుండానే లంచానికి ఆశపడి కటకటాలపాలైంది.