తిరువనంతపురం, నవంబర్ 15: బీజేపీ, మోదీ సర్కారుకు గవర్నర్లు పావులుగా మారారని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి ఆరోపించారు. బీజేపీయేతర పాలిత రాష్ర్టాల్లోని విశ్వవిద్యాలయాల్లో జోక్యం చేసుకొనేలా, బీజేపీ-ఆరెస్సెస్ ఎజెండా అమలు చేసేలా గవర్నర్ల కార్యాలయాలు మారిపోయాయని విమర్శించారు. ఇండియాను ఫాసిస్టు హిందుత్వ దేశంగా మార్చే కుట్రలో ఇది భాగమని తెలిపారు.
కేరళ సర్కారు నియమించిన వీసీలను గవర్నర్ వ్యతిరేకించటం, వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం.. దాంతో వర్సిటీల చాన్స్లర్ పదవి నుంచి గవర్నర్ను తప్పిస్తూ కేరళ క్యాబినెట్ ఆర్డినెన్స్ తీసుకురావటం.. లాంటి పరిణామాలు కేరళ సర్కారు, గవర్నర్ మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తీరును నిరసిస్తూ మంగళవారం తిరువనంతపురంలోని రాజ్భవన్ ఎదుట ఎల్డీఎఫ్ శ్రేణులు నిరసన చేపట్టాయి.
అంతకుముందు మార్చ్ నిర్వహిస్తూ రాజ్భవన్కు భారీగా తరలివచ్చారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఏచూరి.. గవర్నర్ ఆరిఫ్ తన కార్యాలయాన్ని ‘మోదీ సర్కారుకు రాజకీయ కార్యాలయం’గా మార్చేశారని మండిపడ్డారు. ఇలాంటి అనారోగ్య చర్యలు భారత ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయని అన్నారు. ఇలాంటివి కేరళలోనే కాదు అన్ని బీజేపీయేతర రాష్ర్టాల్లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా, ఎల్డీఎఫ్ రాజ్భవన్ వద్ద ధర్నా నిర్వహించగా, ఆ సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ ధర్నాలో కేరళ సీఎం విజయన్, ఆయన మంత్రివర్గం పాల్గొనలేదు.