బెంగాల్ సీఎంకు గవర్నర్ ధన్కర్ లేఖ
కోల్కతా, మార్చి 6: బెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గవర్నర్ ధన్కర్ మరోసారి లేఖ రాశారు. వివాదాలను పరిష్కరించుకొనేందుకు కూర్చొని మాట్లాడుకుందామని, వచ్చే వారం చర్చలకు రావాలని కోరారు. రాజ్యాంగ ప్రతిష్ఠంభనను నివారించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలకు గవర్నర్ మోకాలడ్డుతున్నారని టీఎంసీ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ బిమన్ బెనర్జీ, గవర్నర్ ధన్కర్ ఆదివారం భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు సాగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. ఈ విషయాన్ని గవర్నర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చర్చలకు రావాలని సీఎం మమతాబెనర్జీకి ధన్కర్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకొన్నది.