న్యూఢిల్లీ : కాలుష్య కోరల్లో చిక్కుకున్న గంగా నదిని పరిశుభ్రంగా మార్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఎంత వరకు ఫలించాయో తేలుసుకునేందుకు అధ్యయనం నిర్వహించనున్నది. ఇందుకు రెండు రకాల చేపలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా డాల్ఫిన్లు, హిల్సా చేపల జీవిత చక్రంపై అధ్యయనం చేయనున్నది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) శాస్రవేత్తలు కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహాయంతో అధ్యయనం నిర్వహించనున్నారు.
ఇందులో డాల్ఫిన్లు, హిల్సా చేపలు, సూక్ష్మజీవులపై అధ్యయనం చేపట్టి, దీంతో నది ఎంత శుభ్రంగా మారిందో తెలుసుకోనున్నారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) డైరెక్టర్ జనరల్ జీ అశోక్ కుమార్ మాట్లాడుతూ నది ఆరోగ్యాన్ని నెలకొల్పడంలో ఈ బయో ఇండికేటర్లు ముఖ్యపాత్రను పోషిస్తాయని వివరించారు. నీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు మిషన్ కింద అనే కార్యక్రమాలు చేపట్టామని, అధ్యయనం ద్వారా ఎంతమేరకు మెరుగుపడిందో పరిశీలించాలన్నారు. సూక్ష్మజీవుల వైవిధ్యంపై మానవ జోక్యం ప్రభావం, గంగా నదిలో ఉన్న ఈ.కోలి మూలాలపై కూడా అధ్యయనం చేస్తామని అశోక్ కుమార్ చెప్పారు.
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ద్వారా గంగా నదిపై జరుగుతున్న అధ్యయనాలు, పరిశోధనల్లోనే ఇది భాగమని పేర్కొన్నారు. గంగా నదికి సంబంధించిన అంశాలపై పరిశోధన, విధానం, నాలెడ్జ్ మేనేజ్మెంట్పై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఎన్ఎంసీజీ ప్రకారం.. హిల్సా, డాల్ఫిన్ చేపల ప్రస్తుతం, గతంలో ఉన్న సంఖ్యను పరిశీలించనున్నారు. వాటి సంఖ్య పెరిగిందంటే గంగా నది ఎంత పరిశ్రభంగా మారిందో తెలుస్తుంది. వాటి సంఖ్య తగ్గితే మాత్రం ఇంకా శుభ్రంగా మారనట్లే. గత నాలుగు సంవత్సరాల్లో గంగా నదిలో 190 రకాల చేప జాతులు నమోదయ్యాయని ఎన్ఎంసీజీ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.