న్యూఢిల్లీ, నవంబర్ 6: వాయుకాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో తిరిగి సరి-బేసి విధానం అమల్లోకి రానుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్రంలో నవంబర్ 13 నుంచి 20 వరకు కార్లకు సరి-బేసి విధానాన్ని అమలుజేస్తామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం ప్రకటించారు. దీనికంటే ముందు కాలుష్య నియంత్రణపై ఉన్నతాధికారులతో సీఎం కేజ్రీవాల్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని మంత్రి మీడియాకు వెల్లడించారు. దీపావళి, ఢిల్లీలో జరగబోయే ప్రపంచ క్రికెట్ పోటీ సందర్భంగా పటాసులు ఎవ్వరూ కాల్చరాదని హెచ్చరించారు.
బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న 10, 12 గ్రేడ్స్ విద్యార్థులకు తప్ప మిగతా క్లాసుల తరగతుల నిర్వహణను సస్పెండ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ‘దీపావళి తర్వాత సరి-బేసి విధానం అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత కొనసాగించాలా? లేదా? అన్నది నవంబర్ 20న తెలుపుతాం. సరి-బేసి అమలుపై రవాణాశాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం. మినహాయింపులు ఎవరికి ఇవ్వాలన్నది చర్చిస్తాం’ అని చెప్పారు. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా సరి-బేసి విధానాన్ని ఢిల్లీలో 2016లో తీసుకొచ్చారు. వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తేవటం ఆ రాష్ట్రంలో ఇది నాలుగోసారి.