Gita Press | ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్కు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ గీతా ప్రెస్ను 2021 సంవత్సరానికి గాంధీ శాంతి పురస్కారానికి కేంద్రం సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. అహింస, సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పును తీసుకువచ్చే దిశగా సేవలందించిన గీతా ప్రెస్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా గాంధీ సిద్ధాంతాలైన శాంతి, సామాజిక సామరస్యాన్ని పెంపొందించే దిశగా గీతా ప్రెస్ అందించిన సేవలను ప్రధాని గుర్తు చేశారు.
ఈ పురస్కారం కింద రూ.కోటి నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, కళాత్మకంగా రూపొందించిన హస్తకళా వస్తువు అందించనున్నారు. ఇదిలా ఉండగా.. సంస్థ ఏర్పాటై వంద త్వరలో వంద సంవత్సరాలవుతున్నది. రాజస్థాన్ చురు నివాసి జైదయాల్జీ గోయాండ్కా (సేఠ్జీ) గీతా ప్రెస్ని స్థాపించారు. ఆయనకు గోరఖ్పూర్లోని సహబ్గంజ్కు చెందిన ఘనశ్యామ్దాస్, మహావీర్ ప్రసాద్ పొద్దార్ సహకారం అందించారు. 1923లో ఏప్రిల్ 29న గీతా ప్రెస్ ఏర్పాటు కాగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపును సాధించింది.
ఇప్పటివరకు ఆ సంస్థ 14 భాషల్లో 41.7 కోట్లకుపైగా పుస్తకాలను ప్రచురించింది. అందులో శ్రీమద్భగవద్గీతనే 16.21 కోట్లకుపైగా కాపీలను ముద్రించారు. ప్రతి ఏటా అందించే గాంధీ శాంతిపురస్కరాన్ని మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పురస్కారానికి విదేశీయులతో పాటుగా అన్ని వర్గాలకు చెందిన వారు అర్హులే. గతంలో పురస్కారాన్ని అందుకున్న వారిలో ఒమన్ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్ అల్ సైద్( 2019), బంగ్లాదేశ్కు చెందిన బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ (2020) ఉన్నారు.