న్యూఢిల్లీ: దేశంలోని పది యాప్ డెవలపింగ్ కంపెనీలపై గూగుల్(Google) సంస్థ సీరియస్ అయ్యింది. ప్లే స్టోర్ నుంచి ఆ కంపెనీల యాప్లను తొలగించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆ పది కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పింది. ప్లే స్టోర్ విధానానికి వ్యతిరేకంగా ఆ యాప్ కంపెనీలు వ్యవహరిస్తున్నట్లు గూగుల్ సంస్థ ఆరోపించింది. ఆ జాబితాలో ప్రఖ్యాత కంపెనీలు కూడా ఉన్నట్లు గూగుల్ తెలిపింది. ఎన్ని సార్లు డెడ్లైన్ పొడిగించినా.. ఆ యాప్ కంపెనీలు ప్లే స్టోర్కు ఫీజులు చెల్లించడంలేదని గూగుల్ పేర్కొన్నది. పది డెవలపర్స్కు చెందిన యాప్లను త్వరలోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీలిస్ట్ చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇటీవల ఫోన్ పే కొత్తగా ఇండస్ యాప్ స్టోర్ను ప్రారంభించింది. యాప్ డెవలపర్స్కు ఫ్రీగా డిజిటల్ మార్కెట్ను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ సంస్థ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్లో గేట్కీపింగ్ ఫీజులు, ఎక్స్ట్రా కమీషన్లు ఎక్కువగా ఉన్నాయని యాప్ డెవలపర్లు ఆరోపిస్తున్నారు. కానీ గూగుల్ సంస్థ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. యాప్ డెవలపర్ల వద్ద నుంచి అతి తక్కువ ఛార్జీలు వసూల్ చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.