అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ముందే గర్భగుడిలో విరాజితుడైన బాలరాముడి విగ్రహ ఫొటోలు బయటకు వచ్చాయి. మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల పొడవైన కృష్ణశిలా విగ్రహం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. ఐదేండ్ల బాలుడు మందస్మిత వదనంతో ఉన్నట్టుగా రూపొందించిన ఈ విగ్రహానికి బంగారు ధనుస్సును, బాణాన్ని అమర్చనున్నారు. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ జరుగనుండగా, ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు అయోధ్య మహోత్సవానికి రావాలంటూ ప్రముఖులకు ఆహ్వాన లేఖలు పంపుతున్నది.
అయోధ్య/న్యూఢిల్లీ, జనవరి 19: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. ఈ నెల 22న జరుగనున్న ప్రాణప్రతిష్ఠకు మూడు రోజుల ముందే ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించే రామ్లల్లా విగ్రహం పూర్తి ఫొటో శుక్రవారం బయటకొచ్చింది. మొదటి సారిగా విడుదలైన ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. కండ్లకు పసుపు వస్త్రం కట్టి, మెడలో రోజా పూలమాల ఉన్న బాలరాముడి చిత్రాన్ని వీహెచ్పీ ఉదయం విడుదల చేయగా.. మధ్యాహ్నం తర్వాత రామ్లల్లా పూర్తి రూపంతో కూడిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఐదేండ్ల రాముడు ఒక చేతిలో బంగారు విల్లు, మరో చేతిలో బాణం ధరించి ఉన్నాడు. కృష్ణ శిలపై చెక్కిన బాలరాముడి విగ్రహంలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతున్నదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 51 అంగుళాల ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చెక్కాడు.
అయోధ్య తీర్పు ‘ధర్మాసనానికి’ ఆహ్వానం
అయోధ్య వివాదంపై తీర్పు నివ్వడం ద్వారా ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులకు కూడా ఈ నెల 22న జరిగే ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. దశాబ్దాల వివాదానికి తెరదించుతూ ఐదుగురు సభ్యుల బెంచ్ 2019, నవంబర్ 9న చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానాలు అందుకొన్న వారిలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, మాజీ సీజేఐలు రంజన్ గొగోయ్, ఎస్ఏ బాబ్డే, మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు.
రాములోరికి కానుకల వెల్లువ
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సమీపిస్తున్న క్రమంలో రాముడికి దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి బహుమతులు వెల్లువలా వస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయంలో తయారు చేసిన 5 లక్షల లడ్డూలు శుక్రవారం అయోధ్యకు బయలుదేరాయి. లడ్డూలను తీసుకెళ్తున్న ఐదు ట్రక్కులకు సీఎం మోహన్ యాదవ్ పచ్చజెండా ఊపారు. ప్రస్తుత కర్ణాటకలోని హంపి రీజియన్లో ఉన్న హనుమంతుడి జన్మస్థలంగా చెప్పే కిష్కింద నుంచి ఒక రథం శుక్రవారం అయోధ్య చేరుకొన్నది. ఇంకా ఆలయానికి సుగంధ ద్రవ్యాలు, రాముడి బొమ్మతో అలంకరించిన కంకణాలు, స్వీట్లు, 500 కేజీల ఐరన్-కాపర్ ఊరేగింపు వాహనం, బియ్యం, కూరగాయలు వంటివి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ బయలుదేరింది.
వాకింగ్, సైక్లింగ్, స్కేటింగ్ చేస్తూ..
ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో అన్ని దారులు అయోధ్య వైపే ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి ప్రజలు మతాలకు అతీతంగా అయోధ్య చేరుకొనే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కొంతమంది భక్తులు సుదూరాలను కవర్ చేస్తూ, ఎముకలు కొరికే చలిని తట్టుకొంటూ వాకింగ్ సహా సైక్లింగ్, స్కేటింగ్ వంటి సాహస యాత్రల రూపంలో బయలుదేరారు. బీహార్కు చెందిన నితీశ్ కుమార్ అనే వ్యక్తి 615 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కుకుంటూ అయోధ్యకు చేరుకొన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు సమయంలోనే తాను ఈ నిర్ణయం తీసుకొన్నానని అతను పేర్కొన్నాడు. 124 గంటల పాటు డ్యాన్స్ చేసి గిన్నెస్ రికార్డు సాధించిన సోనీ చౌరిసియా ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. ఆమె వారణాసి నుంచి అయోధ్యకు 17న స్కేటింగ్పై బయలుదేరారు. మతసామరస్యాన్ని, హిందూ-ముస్లిం ఐక్యతను చాటుతూ మహారాష్ట్రకు చెందిన షేక్ షబ్నాం ముంబై నుంచి అయోధ్యకు 1,400 కిలోమీటర్ల మేర కాలినడకన బయలుదేరారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. ఏ విధమైన సమస్య, విపత్తు తలెత్తినా ఎదుర్కొనేందుకు పలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వారికి సాయంగా ‘హజ్మాత్’ వాహనాలను కేటాయించినట్టు ఎన్డీఆర్ఎఫ్ డీజీ కర్వాల్ పేర్కొన్నారు. వీరికి రసాయన, జీవ, రేడియో ధార్మిక, అణు దాడులను ఎదుర్కోవడంతో పాటు భూకంపాలు వంటి విపత్తు సమయంలో తగిన విధంగా స్పందించే నైపుణ్యం ఉన్నదని తెలిపారు.
22న పలు రాష్ర్టాల్లో సెలవు
రాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో పలు రాష్ర్టాలు, యూటీల్లో ప్రభుత్వాలు ఈనెల 22న సెలవు ప్రకటించాయి. ఇప్పటి వరకు మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్, యూటీలు పుదుచ్చేరి, చండీగఢ్ ఆ రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించగా.. కేరళ, అస్సాం, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, త్రిపురలో ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న తన అన్ని కార్యాలయాలు, సంస్థలు, పరిశ్రమలకు సగం రోజు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
శిల్పకళపై మక్కువతో ఉద్యోగం వీడి..
అయోధ్య ఆలయంలో కొలువుదీరనున్న బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. కర్ణాటకలో మైసూర్లోని శిల్ప కళా కుటుంబానికి చెందిన యోగిరాజ్ దేశంలోనే ప్రముఖ శిల్పిగా పేరుపొందాడు. యుక్త వయసులోనే అతను శిల్ప ప్రపంచంలోకి ప్రవేశించాడు. అతని నైపుణ్యమే రామ్లల్లా విగ్రహాన్ని మలిచే అదృష్టం వచ్చేలా చేసింది. 1983లో జన్మించిన యోగిరాజ్.. ఎంబీఏ పూర్తి చేశాడు. మొదట కార్పొరేట్ ఉద్యోగంలో చేరినా.. తన కుటుంబ మూలమైన శిల్పకళపై అతనికి ఉన్న మక్కువ అతన్ని 2008లో ఆ వైపు వెళ్లేలా చేసింది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆకర్షణీయంగా ఉండే 30 అడుగుల పొడవైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహంతోపాటు కేదార్నాథ్లో ప్రతిష్ఠించిన 12 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహాన్ని కూడా యోగిరాజ్ చెక్కారు. ఇంకా దేశంలోని పలుచోట్ల ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకొన్న శిల్పాలు ప్రతిష్ఠించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆయన పలు అవార్డులు, సత్కారాలు పొందారు.