న్యూఢిల్లీ : కాదేదీ చోరీకి అనర్హం అన్న విషయాన్ని రుజువు చేస్తూ యూకేలోని బ్లెన్హీమ్ ప్యాలెస్లో రూ.52 కోట్ల విలువైన 18 క్యారట్ల బంగారు టాయిలెట్ను కొందరు చోరులు ఐదు నిమిషాల్లో అపహరించారు. 2019కు చెందిన ఈ కేసును బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు సోమవారం విచారించింది. డొనాల్డ్ ట్రంప్ కెరీర్తో ముడిపడి ఉన్న ఈ బంగారు టాయిలెట్ 2019 సెప్టెంబర్లో ఆక్స్ఫర్డ్లోని ప్యాలెస్లో ఏర్పాటు చేయగా, తెల్లవారు జామున ప్రవేశించిన నిందితులు ఐదు నిమిషాల్లో దానిని పెకలించుకుని పోయారు. అనంతరం పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి ఆర్ట్వర్క్ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని, దానిని వారు విడగొట్టి అమ్మేసి ఉంటారని వారు భావిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ముందస్తు ప్లాన్తో ఈ భారీ చోరీకి పాల్పడి ఉంటారని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితులపై దోపిడీ, ఆస్తి బదలాయింపునకు కుట్ర, తదితర ఆరోపణలు నమోదు చేశారు.