Gold ship: అది బంగారు నౌక..! ప్రపంచంలో బంగారంతో తాపడం చేసిన తొలి నౌక..! సామాన్యులు ఈ నౌకలో కాలు కూడా పెట్టలేరు. ఎందుకంటే ఈ నౌకలో ప్రయాణం చాలా ఖరీదు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. ఇంతకూ ఆ నౌకను ఎవరు తయారు చేశారు..? ఆ నౌక యజమాని ఎవరు..? ప్రస్తుతం ఆ నౌక ఎక్కడుంది..? దాని ప్రత్యేకతలు ఏమిటి..? అనే ప్రశ్నలు మీ మెదళ్లను తొలుస్తున్నాయి కదా..? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి..
బంగారు ధగధగలతో మిరుమిట్లు గొలిపే ఈ నౌకకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారునౌక. నౌక వెలుపలి వైపు పూర్తిగా 24 క్యారట్స్ బంగారు రేకుతో తాపడం చేశారు. నౌక లోపల కూడా గదుల్లోని ఫర్నిచర్ హ్యాండిల్స్, నాబ్స్, షాండ్లియర్స్, గ్లాస్ ఫ్రేమ్స్ లాంటి వాటిని కూడా పూర్తిగా బంగారు తాపడంతో తయారు చేశారు. ఆస్ట్రేలియన్ కంపెనీ ఏకే రాయల్టీ అధినేత ఆరన్ ఫిడ్లర్ ఆ నౌకకు యజమాని.
ఆ నౌకలో సిబ్బందితో పాటు మరో 12 మంది అతిథులు విలాసవంతంగా ప్రయాణించవచ్చు. అతిథుల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన డైవింగ్ స్కూటర్లు, జెట్ స్కీ బోట్లు లాంటివి కూడా పూర్తిగా బంగారు తాపడం చేసినవే కావడం విశేషం. ఇందులో నాలుగు లగ్జరీ సూట్లు, ప్రత్యేక డైనింగ్ రూమ్లు, బాంకెట్ హాల్, స్విమింగ్ పూల్, బాక్సింగ్ పరికరాలతో కూడిన అధునాతన జిమ్, సినిమా థియేటర్, డీజే బూత్, పబ్ తదితర విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.
దాదాపు 136 అడుగుల పొడవు ఉండే ఆ నౌకను ఎటు నుంచి చూసినా కళ్లు చెదిరేలా బంగారు ధగధగలే కనిపిస్తాయి. ఏటా వేసవిలో, శీతా కాలంలో ఆ నౌకను ప్రయాణికుల విహారానికి అద్దెకు ఇస్తున్నారు. ఆ నౌకలో ప్రయాణించాలంటే వారానికి లక్ష పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ.1.05 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.