Gold Coins | ఓ మహిళ ఇంట్లో టాయిలెట్ నిర్మాణం కోసం కూలీల సహాయంతో గుంత తవ్వుతున్నది. ఈ క్రమంలోనే కూలీలకు ఓ రాగిపాత్ర కనిపించింది. దాన్ని తెరిచిచూడగా.. బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణేలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్ జౌన్పూర్ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ నూర్ జహాన్ కుటుంబ సభ్యులు గానీ, కూలీలు విషయాన్ని బయటకి పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. చివరకు బంగారు నాణేల గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. బంగారు నాణేలు బ్రిటిష్ (1889-1920) కాలానికి చెందినవని తేలింది. పోలీసులు పలువురు కూలీలను విచారించగా.. మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇమామ్ అలీ రైనీ భార్య నూర్ జహాన్ తన ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంత తవ్విస్తున్నది. గొయ్యి తవ్వుతున్న క్రమంలో ఓ రాగి కనిపించింది.
అందులో బంగారు నాణేలు కనిపించడంతో పనులు మానేసి వాగ్వాదానికి దిగారు. మరుసటి రోజు కూలీలు తిరిగి వచ్చి మళ్లీ ఇంకా ఏమైనా దురుకుతాయేమోనని ఆశతో మళ్లీ తవ్వారు. అయితే, ఓ కూలీ రైనీని తనకు బంగారు నాణేలు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో కూలీకి ఒక బంగారు నాణెం ఇచ్చాడు. అయితే, బంగారు నాణేల విషయం పోలీసులకు తెలిసింది. దీంతో ఇన్చార్జి ఇన్స్పెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు రైనీ కుటుంబాన్ని, కూలీలను విచారించగా.. మొదట అలాంటిదేమీ లేదని బుకాయించారు. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో చివరకు విషయాన్ని బయటపెట్టారు. కూలీలు బంగారు నాణేలను పోలీసులకు తిరిగి ఇచ్చారు. అసలు రాగి పాత్రలో ఎన్ని నాణేలు దొరికాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కూలీలను పోలీసులు విచారిస్తున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లగా.. కూలీలను ఆరా తీస్తే పది నాణేలు లభ్యమయ్యాయి. నాణేలన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని మచ్లీషహర్ అధికారి అతర్ సింగ్ వివరించారు.