భువనేశ్వర్ : కంచే చేను మేసిందన్న చందంగా.. దోపిడీలు, దొంగతనాలను అరికట్టాల్సిన పోలీసులే న్యూ ఇయర్ దావత్ కోసం కక్కుర్తిపడ్డాడు. రెండు మేకలను దొంగిలించి చివరకు ఓ ఏఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బలంగీర్ జిల్లా సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తన గురు అనే వ్యక్తి ఈ నెల 31న మేకలను మేపుకునేందుకు వెళ్లగా.. మందలో నుంచి రెండు రెండు మేకలు మాయమయ్యాయి. వాటి కోసం చుట్టుపక్కల అంతటా వెతికారు. ఎక్కడా కనిపించలేదు.
మేకలు మేపుతున్న ప్రాంతానికి దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉండగా.. అక్కడ రెండు మేకలను కోస్తుండగా సంకీర్తన గురు కూతురు చూసింది. ఈ విషయాన్ని తండ్రికి తెలిపింది. దీంతో సంకీర్తన గురు మేకలకు సంబంధించి డబ్బులు ఇవ్వాలని అడిగితే ఇవ్వకుండా.. బెదిరింపులకు దిగారు. దీంతో సంకీర్తన గురు విషయాన్ని గ్రామస్తులకు వెల్లడించాడు. అందరు కలిసి పోలీస్స్టేషన్కు చేరుకొని పోలీసులను నిలదీశారు. ఈ విషయం బలంగీర్ ఎస్పీ వద్దకు వెళ్లింది. దీంతో ఏఎస్ఐ సుమన్ మల్లిక్ను ఎస్పీ సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.