పనాజీ : తమ రాష్ర్టానికి వచ్చే పర్యాటకుల సమ్మతి లేకుండా వారితో ఫొటోలు లేదా సెల్ఫీలు తీసుకొనే వారిని అరెస్ట్ చేస్తామని లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోవా పోలీసులు కఠినమైన కొత్త మార్గదర్శకాల్ని జారీ చేశారు. పర్యాటకులు వేధింపులకు గురి కాకుండా ఉండటానికి, వారి గోప్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పర్యాటకుల అనుమతి లేకుండా అపరిచితులు, ఇన్ఫ్లూయెన్సర్లు, ఫొటోగ్రాఫర్లు వారి ఫొటోలు తీయకూడదని తెలిపారు. వారి సమ్మతి లేనిదే వాటిని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేయకూడదని స్పష్టం చేశారు. ఫొటోలు తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని పర్యాటకులపై ఒత్తిడి తీసుకురాకూడదు. అయితే పబ్లిక్ ప్రదేశాలు, సముద్ర తీరాలు, ప్రకృతి దృశ్యాలను ఫొటోలు తీసుకోవచ్చు. అయితే అందులోనూ వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యంగా చేసి ఫొటోగ్రఫీ తీయకూడదు.