పనాజీ: ఏడాది క్రితమే పెండ్లి చేసుకున్న భార్యను సముద్రంలో తోసేసి హత్య చేశాడో హోటల్ మేనేజర్ (Hotel Manager). ఆపై ఆమె ప్రమాద వశాత్తు నీళ్లలో పడిపోయిందని చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే ఓ వ్యక్తి తీసిన వీడియోతో ఉద్దేశపూర్వకంగా ఆమెను చంపాడని తేలడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని లక్నోకు (Lucknow) చెందిన గౌరవ్ కతియార్.. దక్షిణ గోవాలోని (Goa) ఓ లగ్జరీ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే లక్నోకే చెందిన దీక్షా గాంగ్వార్తో వివాహమైంది. ఇద్దరూ గోవాలోనే కాపురం ఉంటున్నారు. అయితే గౌరవ్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నది. ఇదే విషయమై దంపతులిద్దరి మధ్య తరచూ గొడవలవుతున్నాయి. ఎలాగైనా ఆమె అడ్డుతొలగించుకుందామని అనుకున్న గౌరవ్.. ఆమెను తన హోటల్కు దగ్గర్లోనే ఉన్న కాబో డి రామా బీచ్కు (Cabo de Rama beach) శికారుకు తీసుకెళ్లాడు.
బీచ్లో రాళ్లు ఉన్న ప్రదేశంలో ఆమెను సముద్రంలోకి తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె మృతిచెందింది. అయితే ప్లాన్ ప్రకారం అది ప్రమాదంగా చిత్రీకరిద్దామని అనుకున్నాడు. పోలీసులను తప్పుదోవ పట్టించే క్రమంలో ఉండగా.. వారికి ఓ వీడియో లభించింది. బీచ్లో ఉన్న ఓ వ్యక్తి గౌరవ్ తన భార్యను కొడుతుండగా, సముద్రంలో తోసేసిన దృష్యాలను తన కెమెరాలో బంధించాడు. ఒడ్డుకు వచ్చిన అతడు.. ఆమె చనిపోయిందో లేదోనని నిర్ధారించుకోవడానికి మళ్లీ సముద్రంలోకి వెళ్లిన దృష్యాలు అందులో రికార్డయ్యాయి. దీంతో గౌరవ్ను పోలీసులు అరెస్టుచేశారు.