పనాజీ: గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షమైన కాంగ్రెస్ను చీల్చేందుకు కుట్ర పన్నింది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసింది. ఈ నేపథ్యంలో ఈ కుట్రలో భాగమైన ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలపై గోవా కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. వారిపై అనర్హత వేటుకు సిద్ధమైంది. గోవా అసెంబ్లీలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. రెండు రోజుల కిందట జరిగిన పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలు మైఖేల్ లోబో, దిగంబర్ కామత్, కేదార్ నాయక్, రాజేష్ ఫల్దేశాయి, డెలియాలా లోబో గైర్హాజరయ్యారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన వారంతా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నట్లుగా వార్తలొచ్చాయి.
కాగా, దీనిపై వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్ఠానం సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఎంపీ ముకుల్ వాస్నిక్కు గోవా పంపింది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రారంభమైన వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తాము కాంగ్రెస్తోనే ఉన్నామని కొందరు ఎమ్మెల్యేలు తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్లో చీలిక కోసం ఎమ్మెల్యేలు మైఖేల్ లోబో, దిగంబర్ కామత్, బీజేపీతో కుమ్మక్కై కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దినేష్ గుండూరావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గోవా అసెంబ్లీ స్పీకర్ రమేష్ తవాడ్కర్ను కోరినట్లు గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ పాట్కర్ తెలిపారు. ‘మా ఇద్దరు సీనియర్ నాయకులు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. వారిపై అనర్హత పిటిషన్ వేస్తున్నాం. ఏదైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లేనని సుప్రీం కోర్టు తీర్పు చెబుతోంది’ అని పాట్కర్ అన్నారు.