పనాజీ: గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాలపై గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి మరింత జాగ్రత్త వహిస్తున్నది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ మారే పద్ధతిని తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా గోవా కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విధేయత ప్రతిజ్ఞ చేస్తున్నారు. వివిధ మతపరమైన ప్రదేశాలను సందర్శించడంతోపాటు గోవా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ పట్ల “విధేయత” కలిగి ఉంటామని హామీ ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదేండ్ల కాలం కాంగ్రెస్లోనే ఉంటామంటూ ఆయా దేవుళ్ల ముందు ప్రతిజ్ఞ చేశారు. గోవా కాంగ్రెస్ అభ్యర్థులు ఈ మేరకు మహాలక్ష్మి ఆలయం, బాంబోలిమ్ క్రాస్, హంజా షా దర్గాలను సందర్శించిన ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో షేర్ చేసింది.
కాగా, గత గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 17 మంది అభ్యర్థులు గెలిచారు. అనంతరం 15 మంది ఇతర పార్టీల్లో చేరారు. ఎక్కువగా బీజేపీలో చేరడంతో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గోవాలోని అధికార బీజేపీకి 27 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్ నుంచి ఇద్దరు మాత్రమే సభ్యులు ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది రిపీట్ కాకుండా ఉండేందుకు గోవా కాంగ్రెస్ తన అభ్యర్థులతో పార్టీ, ప్రజల పట్ల “విధేయత” కలిగి ఉంటామని ప్రతిజ్ఞ చేయిస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ గోవా ఇన్చార్జి దినేష్ గుండూరావు, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గిరీష్ చోడంకర్ సహా సీనియర్ నాయకులు 34 మంది అభ్యర్థులతో పాటు ఆయా ప్రార్థనా స్థలాలకు వెళ్లారు. “ప్రజల మనస్సులలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, తమ అభ్యర్థులు దేవుని ముందు ప్రమాణం చేస్తున్నారని గోవా కాంగ్రెస్ చీఫ్ చోడంకర్ తెలిపారు.