పనాజీ: దక్షిణ గోవాలోని సావో జాసింటో ద్వీపం నివాసితులకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఘాటుగా హెచ్చరించారు. జెండా ఎగురవేయకుండా నేవీని అడ్డుకుంటే దేశ వ్యతిరేకత కింద కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వాటిని ఉక్కు పిడికిలితో అణచివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమకు దేశమే తొలి ప్రాధాన్యత అని ట్వీట్ చేశారు. ఆ ద్వీపంలో జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించాలని నేవీని కోరారు. గోవా పోలీసుల సహకారం అందిస్తామని చెప్పారు.
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ నెల 13 నుంచి 15 వరకు దేశంలోని అన్ని ద్వీపాల్లో జాతీయ జెండాలను ఎగురవేసే కార్యక్రమానికి రక్షణ మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గోవాలోని ఐఎన్ఎస్ హంసా నౌకా కేంద్రం అధికారులు ఏర్పాట్ల కోసం సావో జాసింటో ద్వీపానికి వెళ్లారు. అయితే అక్కడున్న సుమారు వంద కుటుంబాలు జెండాను నేవీ ఎగురవేయడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ కార్యక్రమం చేపట్టబోమని నేవీ తెలుపగా గోవా సీఎం ఈ మేరకు స్పందించారు.
అయితే, జాతీయ జెండా ఆవిష్కరణకు తాము వ్యతిరేకం కాదని సావో జాసింటో వాసులు స్పష్టం చేశారు. మేజర్ పోర్ట్స్ అథారిటీస్ బిల్లు 2020 కింద కేంద్ర ప్రభుత్వం ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నాటి నౌకాదళం జెండా ఆవిష్కరణతో ఇది ప్రారంభమవుతుందేమోనని భయపడ్డారు. ఈ నేపథ్యంలో జాతీయ జెండాను ఎగురవేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు స్థానికులు వెల్లడించారు.
కాగా, తమ భూమిని ఎవరికీ అమ్మకూడదని సావో జాసింటో ద్వీప నివాసులు కొన్నేండ్ల కిందట ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో మేజర్ పోర్ట్స్ అథారిటీస్ బిల్లు కింద కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటుదేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.