న్యూఢిల్లీ : ఈ నెల 10న గోవాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆమె బహిరంగ సభలో ప్రసంగించడంతో పలు వర్గాలతో మాట్లాడుతారన్నారు. అస్సోల్నా, క్యూపెం తాలూకాల్లోని మోర్పిర్ల వద్ద గిరిజన మహిళలతో సంభాషించడంతో పాటు వారితో కలిసి భోజనం చేస్తారని, అలాగే విద్య కార్యకర్తలతో మాట్లాడుతారని పేర్కొన్నారు. కోస్తా మైదానం, అక్వెమ్లో ‘ప్రియదర్శని మహిళా’ సమ్మేళనంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రసంగించనున్నారు.
మహిళా కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలతో భేటీకానున్నారు. చికాలీమ్ మైదానంలో మోర్ముగోవ్ పార్టీ కార్యకర్తల పాల్గొంటారని, ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరుతారన్నారు. ఇదిలా ఉండగా.. శివసేన ఎంపీ సంజయ్రౌత్ బుధవారం ఢిల్లీలో ప్రియాంక గాంధీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య గోవాలో పొత్తుపై చర్చించారు. ఇటీవల గోవా మాజీ ముఖ్యమంత్రి లూయిజిన్హో ఫలీరో ఇటీవల కాంగ్రెస్ను వీడి, టీఎంసీలో చేరారు. ఇంతకు ముందు ప్రియాంక గాంధీ అక్టోబర్లో గోవాలో పర్యటించారు.