భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ స్కూల్లో దారుణం వెలుగుచూసింది. బాలికలతో టాయిలెట్లను శుభ్రం చేయించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుణ జిల్లాలోని చక్దేవ్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఐదు, ఆరు తరగతి చదివే కొందరు బాలికలతో స్కూల్ మరుగుదొడ్లను మంగళవారం శుభ్రం చేయించారు. చీపుర్లు చేత పట్టిన ఆ బాలికలు హ్యాండ్ పంప్ నుంచి నీటిని తెచ్చి టాయిలెట్లను కడిగారు. గురువారం స్థానిక మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. బాలికలు టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఆ రాష్ట్ర పంచాయతీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఈ సంఘటనపై స్పందించారు. దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవలని గుణ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మరోవైపు విద్యా శాఖకు చెందిన అధికారుల బృందం కూడా గురువారం ఆ స్కూల్కు వెళ్లింది. ఈ సంఘటనపై వేరుగా దర్యాప్తు చేస్తున్నది. అయితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ అధికార సమావేశం కోసం గుణ టౌన్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు ఒక అధికారి తెలిపారు.