లక్నో: ప్రియురాలు తన మొబైల్ నంబర్ను బ్లాక్ చేయడంపై ఒక వ్యక్తి కలత చెందాడు. సుమారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లాడు. అక్కడ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు (Man Pours Petrol). నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. యోగేష్ అనే యువకుడికి 9వ తరగతి నుంచే ఒక యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. వారిద్దరూ కలిసి కాన్పూర్లో కొంతకాలం సహజీవనం చేశారు. ఇంటర్ తర్వాత యోగేష్ చదువు మానేశాడు. తన కుటుంబంతో కలిసి డైరీలో పని చేస్తున్నాడు.
కాగా, యోగేష్ ప్రియురాలు ఇంటర్ తర్వాత బరేలీ జిల్లాలోని ఫరీద్పూర్ ఫార్మసీ కాలేజీలో చదువుతున్నది. మంగళవారం మొబైల్లో సంభాషిస్తున్న సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో యోగేష్ ఆగ్రహంతో ఆమెను తిట్టాడు. కలత చెందిన ఆమె, అతడి మొబైల్ నంబర్ను బ్లాక్ చేసింది. ప్రియురాలితో మాట్లాడే అవకాశం లేకపోవడంతో యోగేష్ వెంటనే కాన్పూర్ నుంచి ఫరీద్పూర్కు బయలుదేరాడు. సుమారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె చదువుతున్న ఫార్మసీ కాలేజీకి వెళ్లాడు. కాలేజీ బిల్డింగ్ నాలుగో అంతస్తుకు చేరుకున్నాడు.
మరోవైపు, ప్రియురాలు తనను కలిసి మాట్లాడకపోవడంతో యోగేష్ అక్కడ హంగామా చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ను ఒంటిపై పోసుకున్నాడు. నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయితే ఫార్మసీ కాలేజీ సిబ్బంది, కొందరు విద్యార్థులు యోగేష్ను పట్టుకుని కొట్టారు. అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించారు.