న్యూఢిల్లీ: ఒక బాలిక వీధి లైట్ల వెలుగులో చదువుతున్నది. స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఆమె ఫుట్పాత్పై కూర్చొని సీరియస్గా రాసుకుంటున్నది. ఆ రోడ్డున వెళ్లే వాహనాల శబ్దాలను లెక్కచేయక తన చదువుపైనే నిమగ్నమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కొందరు విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. అయితే కనీస సౌకర్యాలు కూడా లేని పేద పిల్లల్లో కొందరు చదువు పట్ల ఆసక్తిని చూపడంతోపాటు అందుబాటులో ఉన్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇదే కోవకు చెందిన ఒక పేద బాలిక స్కూల్ తర్వాత ఫుట్పాత్పైనే చదువుకుంటున్నది. వీధి లైట్ల కాంతి వెలుగులోనే హోంవర్క్ చేస్తున్నది. ఆ రోడ్డున పోయే వాహనాల శబ్దాలు, హారన్ మోతలు ఆమె చదువు దీక్షను భగ్నం చేయలేకపోయాయి. ఒక వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఇది కనిపించింది. దీంతో తన మొబైల్లో దీనిని రికార్డు చేశారు.
కాగా, స్టూట్స్ జోన్ 987 అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘నేటి ఉత్తమ వీడియో’ అని దానికి శీర్షిక పెట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా బాగా స్పందించారు. చదువు పట్ల ఆ బాలిక శ్రద్ధ, అంకితభావంపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి పిల్లలు తమ భవిష్యత్తుతోపాటు దేశ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తారని కొందరు కొనియాడారు. ఆ బాలికకు దేవుడు అండగా నిలువవాలని, చల్లాగా చూడాలని మరికొందరు ఆశీర్వదించారు.